లక్ష్మీపురంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ
లక్ష్మీపురంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించిన పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం, లక్ష్మీపురం: లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, రోజురోజుకూ పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశంపై వివరించారు.
సైబర్ నేరాలపై రూపొందించిన పోస్టర్లను ప్రదర్శిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు, KYC అప్డేట్ పేరుతో మోసాలు, OTP, ATM PIN, CVV, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించే మోసాలు, పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు, పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని నమ్మించే మోసాలు, OLXతో పాటు ఇతర ఆన్లైన్ కొనుగోలు–అమ్మకాల మోసాలు, సోషల్ మీడియా ఖాతాల హ్యాకింగ్, QR కోడ్ స్కామ్లు, నకిలీ లోన్ యాప్లు, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్ల ద్వారా జరిగే మోసాల గురించి ప్రజలకు సవివరంగా వివరించారు.
తెలియని వ్యక్తులతో OTP, ATM PIN, CVV, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. అపరిచిత లింకులను క్లిక్ చేయకుండా, తెలియని మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్లు, పెట్టుబడి పథకాలు, ఉద్యోగ ప్రకటనలను పూర్తిగా ధృవీకరించిన తర్వాతే విశ్వసించాలని విద్యార్థులు, యువతకు సూచించారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని వివరించారు.
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడంతో పాటు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఖాకీ స్టూడియో బ్యానర్ కింద రూపొందించిన సైబర్ క్రైమ్ అవగాహన వీడియోలను ప్రజలకు అందించి, వాటిని కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో, ఎమ్మార్వో, డిప్యూటీ విద్యాశాఖ అధికారి శ్యామ్, తిరువూరు ఎస్ఐ శాతకర్ణి, స్థానిక నాయకులు బొల్లినేని రాజా, నెక్కడపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.