అట్లప్రగడలో రైతులకు రాజముద్రతో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
అట్లప్రగడలో రైతులకు రాజముద్రతో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
ఏ.కొండూరు, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలం అట్లప్రగడ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రైతులకు రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు భూమికి సంపూర్ణ రక్షణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. భూ యాజమాన్యానికి చట్టబద్ధమైన గుర్తింపుగా ఈ పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయని, భూ రికార్డుల్లో పారదర్శకత పెరగడంతో నకిలీ పత్రాలు, మోసాలు, అక్రమ మార్పులు, వివాదాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు.
రాజముద్రతో ముద్రించిన ఈ పాస్ పుస్తకాలు అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించబడినవని తెలిపారు. బ్యాంకు రుణాలు, పంట రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు, పంటల బీమా పథకాలు తదితర ప్రభుత్వ సేవలను వేగంగా పొందేందుకు ఇవి రైతులకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ సేవను పారదర్శకంగా, జాప్యం లేకుండా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలోని మౌలిక వసతులు, భూములకు సంబంధించిన పెండింగ్ సమస్యలు, రెవెన్యూ అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గ్రామంలోని పెండింగ్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశిస్తూ, మరో రెండు రోజుల్లో గ్రామాన్ని మళ్లీ సందర్శించి పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే బాధ్యులపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తానని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని, తిరువూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, భూ సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, సర్వేయర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.