బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు
బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు – బాల కిషోరి వికాసం 2.0 కార్యక్రమం శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు
బాలికల సమగ్ర అభివృద్ధికి ‘బాల కిషోరి వికాసం 2.0’ కీలకం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ‘బాల కిషోరి వికాసం 2.0’ కార్యక్రమం శుక్రవారం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై బాలికలకు ప్రేరణనిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యమైనదని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, సరైన పోషకాహారం, పరిశుభ్రత అలవాట్లు, మానసిక స్థైర్యం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాలికలు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించారు.
స్వయం రక్షణ నైపుణ్యాలు, డిజిటల్ అవగాహనతో పాటు సామాజిక బాధ్యతలపై కూడా అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సురక్షిత వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సహించాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్న ఆయన, వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.