బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి
సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని, ఎవరూ కూడా వీటిని ప్రోత్సహించవద్దని వట్టిమర్తి గ్రామ సర్పంచ్ మేడి శ్రీలత పిలుపునిచ్చారు.చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'బాలల పరిరక్షణ' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని ఆమె స్పష్టం చేశారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికలు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి ఆచారాలకు తల్లిదండ్రులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని 14 సంవత్సరాలు నిండిన బాలికల తల్లిదండ్రుల నుండి సేకరించిన కీలక వాగ్దాన పత్రాలను సర్పంచ్ ఐసీడీఎస్ అధికారులకు అందజేశారు. తమ కుమార్తెలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు జరిపిస్తామని తల్లిదండ్రులు ఈ పత్రాల ద్వారా లిఖితపూర్వకంగా వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు అరుణ, ఇందిర, ఆశా కార్యకర్త రజితతో పాటు గ్రామానికి చెందిన గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.