బాపట్లలో ఏసీబీ దాడులు – లంచం కేసులో మున్సిపల్ ఆర్ఐ పట్టివేత
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో ఏసీబీ దాడులతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే, ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ తెలిపిన ప్రకారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఐగా పనిచేస్తున్న ఇమామ్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
చిన్నగంజాం మండలం కొత్తపేటకు చెందిన దేవరకొండ నాగేంద్రం ఇంటి పన్ను పేరు మార్పు కోసం మొత్తం రూ.60,000 డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మొత్తంలో రూ.25,000 లంచంగా, మిగతా రూ.35,000 చలానా రూపంలో తీసుకుంటున్న సమయంలో సోమవారం సూర్యలంక రోడ్డులోని ఓ టీ స్టాల్ వద్ద ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఈ ఘటనతో బాపట్ల పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలిసిన వెంటనే మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బంది తమ సీట్లలో లేకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.