బావిలో పూడిక తీయడానికి దిగి ఇద్దరు కూలీలు మృతి
ఏలూరు జిల్లా, పోలవరం మండలం, నూతనగూడెంలో విషాదం చోటుచేసుకుంది. బావిలో పూడిక తీయడానికి దిగిన ఇద్దరు కూలీలు ఊపిరాడక మృతి చెందారు.
స్థానికుల వివరాల ప్రకారం, నూతన గూడెంకు చెందిన బండి మునేశ్వరరావు ఇంటి బావిలో పూడిక తొలగించేందుకు గణేష్ నగర్కు చెందిన రాజుతో పాటు పైడిపాక పునరావాస కాలనీకి చెందిన బండి వీర వెంకటరావు, చిట్టిబాబు (రెడ్డి) వెళ్లారు.
ముందుగా చిట్టిబాబు బావిలోకి దిగగా ఊపిరాడటం లేదంటూ కేకలు వేశాడు. అతడిని కాపాడేందుకు వీర వెంకటరావు కూడా బావిలోకి దిగాడు. అయితే ఇద్దరూ లోపలే చిక్కుకుపోయారు. స్థానికులు తాడుతో బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలవరం సీఐ కృష్ణకుమార్, ఎస్సై అప్పారావు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు.
ఈ ఘటనతో నూతన గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.