బీసీ మంత్రులను అవమానించిన పొంగులేటి బహిరంగ క్షమాపణ చెప్పాలి
పదవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు: తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్
మంచిర్యాల జిల్లా నేత మహేష్ వర్మ హెచ్చరిక
మంచిర్యాల: తోటి మంత్రులనే గౌరవించని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇక సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా నాయకుడు మహేష్ వర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, బీసీ మంత్రుల పట్ల అగ్రవర్ణ అహంకారాన్ని ప్రదర్శిస్తూ కొందరు శునకానందాన్ని పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. అగ్రవర్ణాల నాయకులు బీసీల పట్ల చూపుతున్న వివక్ష స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత క్యాబినెట్ లోని బీసీ మంత్రులకే ఇలాంటి అవమానాలు జరుగుతుంటే.. తోటి బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించకపోవడం బీసీ సమాజానికే సిగ్గుచేటని మహేష్ వర్మ విమర్శించారు. కేవలం పదవుల కోసమే ఆత్మగౌరవాన్ని చంపుకుని వారు పదవుల్లో కొనసాగుతున్నారని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎద్దేవా చేశారు. బీసీల పక్షాన బలమైన నాయకుడు తీన్మార్ మల్లన్న ఉన్నారని, బీసీ నాయకుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
బీసీలను తక్కువ చేసి చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, రానున్న రోజుల్లో బీసీ, బహుజనుల రాజ్యాధికారం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగా బీసీ మంత్రులకు, బీసీ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని మంచిర్యాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ సంఘాలను, నాయకులను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మహేష్ వర్మ హెచ్చరించారు