బెల్లంపల్లి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ డిమాండ్
కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు: వడ్ల కేంద్రాల వద్ద ఎండలోనే పడికాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు
ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ డిమాండ్ చేశారు. శనివారం బెల్లంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు సకాలంలో సాగకపోవడంతో, అన్నదాతలు ఈ కరుడుగట్టే ఎండల్లో కొనుగోలు కేంద్రాల వద్దే పడికాపులు కాయాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మండలాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఈ సందర్భంగా కోడి రమేష్ తీవ్రంగా ఆరోపించారు. ఎమ్మెల్యే వస్తున్నారంటే చాలు... ఇక్కడి స్థానిక నాయకులు రైతుల సమస్యలను గాలికొదిలేసి, వారి కోసం దావత్లు (విందులు) ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా, విందుల కోసం మేకలు, పొట్టేలను బలి ఇవ్వడానికి కార్యాచరణలు రూపొందించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులకు, పాలకులకు రైతుల కన్నీళ్లు కనబడడం లేదా అని ఆయన ధ్వజమెత్తారు