బండారి మమత చదువుకు అండగా నిలిచిన హొళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్
కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలానికి చెందిన బండారి మమత ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన విద్యార్థిని. కుటుంబంలో నలుగురు కుమార్తెలు ఉండగా, మమత రెండో కుమార్తె. తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లి జీవనం సాగిస్తుండటంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యను కొనసాగించడం కష్టంగా మారడంతో మమత తీవ్ర ఆందోళనకు గురైంది.
మమత పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. అనంతరం ఆర్డీటీ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి మమతకు రూ.40 వేల సెమీ స్కాలర్షిప్ మంజూరు అయ్యేలా సహకరించారు.
అలాగే మమత పరిస్థితిని తెలుసుకున్న హొళగుంద ఎస్ఐ గురజాల దిలీప్ కుమార్ మానవత్వంతో స్పందించి ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన రూ.22 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా మిగిలిన ఫీజు, సీటు వ్యవహారాలపై కర్నూలు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంతో చర్చించి మమత చదువు కొనసాగేందుకు తోడ్పడ్డారు.
తన చదువుకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, హొళగుంద ఎస్ఐ గురజాల దిలీప్ కుమార్, ఆర్డీటీ సంస్థ, శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యానికి బండారి మమత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ, “పేదరికం చదువుకు అడ్డంకి కాదు. సమాజం అండగా ఉంటే ప్రతిభ తప్పకుండా విజయం సాధిస్తుంది” అని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.