బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక
అమరావతి, జులై 2: రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో జులై 3 నాటికి వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే ఏపీ, యానాం పరిధిలోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో గురువారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.