www.ntodaynews.com
బొగ్గు గని పెన్షనర్ల గర్జన: ఈ నెల 30న జంతర్ మంతర్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి
తెలంగాణ
/
మంచిర్యాల
తేదీ: 16-03-2026, సోమవారం
మంచిర్యాల: గత 28 ఏళ్లుగా పెన్షన్ పెంపునకు నోచుకోక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బొగ్గు గని విశ్రాంత ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం దేశ రాజధాని బాట పట్టారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం సమావేశమై, అఖిల భారత బొగ్గు పెన్షనర్ల సంఘం పిలుపు మేరకు ఈ నెల 30న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాన డిమాండ్లు:
50% పెన్షన్ పెంపు: కరువు భత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ను తక్షణమే పెంచాలి.
వైద్య సౌకర్యాలు: CPRMS హెల్త్ కార్డ్పై రూ. 25 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పించాలి.
గ్రాడ్యుటీ: 2016 నుండి పెరిగిన గ్రాడ్యుటీ సీలింగ్ రూ. 20 లక్షలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ముఖ్య అంశాలు:
1998 ఒప్పందం ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి పెన్షన్ పెంచాల్సి ఉన్నా, గత 28 ఏళ్లుగా పైసా కూడా పెంచకపోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వందలాది మంది పెన్షనర్లు రూ. 350 నుండి రూ. 1000 లోపు మాత్రమే పెన్షన్ పొందుతున్నారని, ఇది ప్రభుత్వం ఇచ్చే 'ఆసరా' పెన్షన్ల కంటే తక్కువని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
సమావేశంలో పాల్గొన్న వారు:
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న, అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, కార్యదర్శి ఎన్. అంజయ్య, నాయకులు ఆర్. రమేష్ లాల్, మురహరి, రమేష్, సూర్యం, కె. శంకర్, ఎం. రాజమల్లు, పులి కృష్ణ, ఏ. ప్రభాకర్, ముత్తె భానయ్య, దుర్గం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: శ్రీనివాస్, మంచిర్యాల