బూరుగుగూడెంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏవో బి శివశంకర్ అవగాహన కార్యక్రమం
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామ సచివాలయం వద్ద మంగళవారం రైతులకు పంటల సాగు, పంట నమోదు, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం తదితర అంశాలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు ఈ-పంట నమోదు ప్రాధాన్యతను వివరించారు. వరి, మినుము పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో నమోదు చేసుకునేందుకు ఆగస్టు 15వ తేదీ చివరి గడువు అని తెలిపారు. రైతులు గడువులోగా పంట బీమా నమోదు చేసుకుని ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం సంభవించినప్పుడు ఆర్థిక భద్రత పొందాలని సూచించారు.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. తక్కువ నీటితో పంటలను సాగు చేసే విధానాలు, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునే యాజమాన్య పద్ధతులను వివరించారు. ముఖ్యంగా బిందు సేద్యం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు పంటలకు అవసరమైన నీటిని సమర్థవంతంగా అందించవచ్చని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం వల్ల నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ఖాళీగా ఉన్న భూములను ఏడాది పొడవునా పంటలతో కప్పి ఉంచే విధానాన్ని రైతులు పాటించాలని సూచించారు.
ఈ క్రమంలో నవధాన్యాల సాగు చేపట్టడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు. ఆయిల్పామ్, మామిడి తోటల్లో ఖాళీ ప్రదేశాల్లో నవధాన్యాలు, పప్పుధాన్యాల వంటి పంటలను సాగు చేయడం వల్ల అదనపు ఆదాయంతో పాటు నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూసారం మెరుగుపడుతుందని వివరించారు.
రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకుంటూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. అనంతరం బూరుగుగూడెం గ్రామ రైతులతో పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, నీటి వినియోగం తదితర అంశాలపై చర్చించారు.