బస్సులో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఘటన వైరల్
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధిర నుంచి ఖమ్మం వెళ్తుండగా వైరా మండలం పాలడుగు గ్రామ సమీపంలో ఓ కుటుంబం బస్సు ఎక్కింది. ఈ సమయంలో ఆ కుటుంబానికి చెందిన ఓ మహిళ సీటు కోసం ఇతర మహిళా ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది.
మాటామాటా పెరగడంతో వివాదం తీవ్రరూపం దాల్చి మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. బస్సులోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని వారిని విడదీశారు. ఈ ఘటనతో కొంతసేపు బస్సులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిందని, సీట్ల కోసం తరచూ ఇలాంటి వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.