భార్య కాపురానికి రాలేదని లక్సెట్టిపేటలో వ్యక్తి ఆత్మహత్య
లక్సెట్టిపేట:-భార్య కాపురానికి రావడం లేదనే తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన లక్సెట్టిపేట మండలంలో చోటుచేసుకుంది. లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చందారం గ్రామానికి చెందిన కోడి నరేష్ (33)కు, అతని భార్యకు గత రెండు నెలలుగా కుటుంబ విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన భార్య, తన కుమారుడిని తీసుకొని లక్సెట్టిపేటలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోవడం, తిరిగి కాపురానికి రావడానికి నిరాకరించడంతో నరేష్ తీవ్ర మానసిక ఆందోళనకు గురై మద్యానికి బానిసయ్యాడు.
బావిలో దూకి బలవన్మరణం
జీవితంపై విరక్తి చెందిన నరేష్, ఆదివారం తన ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న లక్సెట్టిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సురేష్ పేర్కొన్నారు. నరేష్ మృతితో చందారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి