భాష్యం రామకృష్ణకు ఘన సన్మానం.. గుంటూరులో ఆత్మీయ అభినందనల వెల్లువ
గుంటూరు: గుంటూరు పట్టణంలోని వి కన్వెన్షన్లో రాజ్యసభ సభ్యుడు, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణకు ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభ ఘనంగా జరిగింది. విద్యా రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొని భాష్యం రామకృష్ణను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా సేవల ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాష్యం రామకృష్ణ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మరింత సమర్థవంతంగా ప్రజలకు, విద్యా రంగానికి సేవలందించాలని ఆకాంక్షించారు. విద్యను సేవగా భావించి సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న భాష్యం రామకృష్ణ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సభలో పాల్గొన్న పలువురు ప్రముఖులు భాష్యం రామకృష్ణ నాయకత్వం, విద్యా రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. సభ ఆత్మీయ వాతావరణంలో కొనసాగగా, అభినందనలు, శుభాకాంక్షలతో వేదిక సందడిగా మారింది.