భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సు ప్రసవం నిర్వహించగా, అనంతరం తల్లి, నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుండాల మండలం శంభూనిగూడెం గ్రామానికి చెందిన వనజ (20)కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని, దీంతో నర్సు సాధారణ ప్రసవం నిర్వహించినట్లు సమాచారం.
ప్రసవం అనంతరం నవజాత శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.
ఇదే సమయంలో ప్రసవం అనంతరం వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది.
ఈ ఘటనకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు విధుల్లో అందుబాటులో లేకపోవడం వల్లే తమ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుందని ఆరోపించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.