సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం
చేనేత వస్త్రాల ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందిన సిరిపురం గ్రామంలో మెయిన్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా, మాజీ ఉపసర్పంచ్ పున్న వెంకటేశంతో కలిసి నకిరేకల్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ Vemula Veereshamకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రాపోలు నరసింహా మాట్లాడుతూ, భారతదేశంలోనే తొలిసారిగా రంగులు, రసాయనాల మిశ్రమ నీటిని శుద్ధి చేసే “వికేంద్రీకృత ఎఫ్లువెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (DETP)” సిరిపురంలో ఏర్పాటు కావడం గ్రామానికి గర్వకారణమని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలులో భాగస్వాములైన DST, CSIR, IICT సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ప్రస్తుతం గ్రామంలోని సుమారు 30 శాతం మురుగునీరు మాత్రమే శుద్ధి కేంద్రానికి చేరుతోందని, మిగిలిన 70 శాతం మురుగునీరు మెయిన్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్లాంట్కు చేరడం లేదని వివరించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి వచ్చే మురుగునీరు శుద్ధి కేంద్రానికి చేరేలా సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొంటూ, భారత ప్రభుత్వ విజ్ఞాన మరియు సాంకేతిక శాఖ (DST) తమ వినతిపై స్పందించినట్లు తెలిపారు. గ్రామ అవసరాన్ని గుర్తించి మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందించినట్లు రాపోలు నరసింహా తెలిపారు. గ్రామ అవసరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, సిరిపురంలో సమగ్ర మెయిన్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.