మహిళగా రూపాంతరం చెంది మోసాలకు పాల్పడిన వ్యక్తి బాగోతం వెలుగులోకి
అన్నమయ్య జిల్లా మదనపల్లి శివాజీనగర్కు చెందిన మోహన కృష్ణ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి, తర్వాత మహిళగా రూపాంతరం చెంది మళ్లీ స్వస్థలానికి తిరిగి వచ్చిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తర్వాత మధు శ్రీ అనే పేరుతో గుర్తింపు పొందిన అతను చీరకట్టుతో ప్రజల మధ్య తిరుగుతూ, వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల పేరుతో కొందరిని, అలాగే పూజలు, గుప్త నిధులు, దుష్టశక్తుల నివారణ వంటి నమ్మకాల ఆధారంగా మరికొందరిని మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
“ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయి, వాటిని తొలగిస్తాను” అంటూ కొంతమందిని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా ఈ వలలో చిక్కుకున్నారని సమాచారం.
అంతేకాకుండా ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని వివాహ వేడుకలకు వెళ్లడం, జంటలపై దిష్టి తీయడం వంటి పేర్లతో డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తన వెనుక పోలీసు, రాజకీయ అండ ఉందని చెబుతూ బెదిరింపులు చేసినట్లు కూడా బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కొన్ని కుటుంబాలు మీడియా ముందుకు రావడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
దాదాపు 13 కుటుంబాలు ప్రభావితమయ్యాయని, కోట్ల రూపాయల మేర మోసపోయామని ఓ బాధితురాలు ఆరోపించినట్లు సమాచారం.