భూమి కోసం భర్త హత్య.. భార్య, కుమార్తె, అల్లుడు అరెస్ట్
నాగర్కర్నూల్ జిల్లాలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఆవంచ గ్రామానికి చెందిన యాదయ్య(54) హత్య కేసును పోలీసులు ఛేదించి భార్య అలివేల, అల్లుడు ఆంజనేయులు, కుమార్తె పద్యను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 1.5 ఎకరాల భూమిని అల్లుడు పేరుపై రాయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా, యాదయ్య నిరాకరించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో జూన్ 23న ముగ్గురు కలిసి ఇంట్లోనే యాదయ్యపై దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది.
అల్లుడు గొంతు పిసికగా, కుమార్తె కాళ్లు పట్టుకుని, భార్య ఇనుప రాడ్తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.
హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, మృతదేహానికి స్నానం చేయించే సమయంలో గాయాలను గుర్తించిన బంధువులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు జూన్ 26న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
కేసు వివరాలను నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. అరెస్టు ప్రక్రియలో సీఐ అశోక్ రెడ్డి, తిమ్మాజిపేట ఎస్సై శ్రీనివాసరావు పాల్గొన్నారు.