Health: చాట్రాయి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి
ఏలూరు జిల్లా | చాట్రాయి మండలం | జూన్ 29 | NTODAY NEWS
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని చాట్రాయి గ్రామ సచివాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) బి. రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో బి. రాజు మాట్లాడుతూ, పోలియో వ్యాధికి శాశ్వత చికిత్స లేకపోయినా, సమయానికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి టీకా వేయించాలని సూచించారు.
"పల్స్ పోలియో చుక్కల్లోనే పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు దాగి ఉంది. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలి" అని ఆయన పిలుపునిచ్చారు.
పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని అధికారులు పేర్కొంటూ, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.