అప్పారావు కుటుంబానికి సహకార సంఘం తరుఫున ఆర్థిక సాయం
చాట్రాయిలో ఇటీవల మృతి చెందిన సహకార సంఘ సభ్యుడు అప్పారావు కుటుంబానికి సహకార సంఘం తరుఫున ఆర్థిక సాయం
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం మండల కేంద్రమైన చాట్రాయి సహకార సంఘం అప్పుదారుడు కలపగిరి అప్పారావు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి సహకార సంఘం అండగా నిలిచింది. అప్పారావు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం సంఘం తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. సంఘం ఛైర్మన్ తుమ్మల రామ్మోహన్ రావు చేతుల మీదుగా ఈ మొత్తాన్ని దివంగత అప్పారావు కుమారుడు కలపగిరి హరిబాబుకు అందజేశారు.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మందపాటి బసవా రెడ్డి మాట్లాడుతూ కలపగిరి అప్పారావు మృతి ఎంతో బాధాకరమని అన్నారు. అప్పారావు కుటుంబానికి ఏర్పడిన లోటును ఎవరూ పూడ్చలేరని, అయితే కష్టసమయంలో కుటుంబానికి అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబానికి సహకార సంఘం తరఫున ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని అన్నారు.
సహకార సంఘం కేవలం రుణాలు అందించే సంస్థగానే కాకుండా, సభ్యులు మరియు వారి కుటుంబాలకు కష్టసమయాల్లో తోడుగా నిలిచే వ్యవస్థగా ఉండాలని బసవా రెడ్డి ఆకాంక్షించారు. అప్పారావు కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రూ.10 వేల సహాయం అందించడం కొంతైనా ఊరటనిస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతు సహకారం అందించేందుకు నాయకులు, సంఘం ప్రతినిధులు ముందుంటారని భరోసా ఇచ్చారు.
సహకార సంఘంతో అనుబంధం ఉన్న సభ్యుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకున్నప్పుడు వారి పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన మేరకు సహాయం అందించే విధంగా సంఘం మరింత చొరవ చూపాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాలు ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంతో పాటు, సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించడం మంచి సంప్రదాయానికి నాంది పలుకుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో సహకార సంఘం సిఈవో తుపాకుల కనకా రావు, డైరెక్టర్ కాలసాని సత్యనారాయణ, ఓరుగంటి రామారావు, రాజేష్, సంజీవరెడ్డి, జనసేన నాయకుడు తుమ్మల కరుణాకర్, సహకార సంఘ సిబ్బంది పాల్గొన్నారు.