చాట్రాయిలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు
చాట్రాయి, ఆగస్టు 5: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు ఎల్నీనో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించాలని, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వరి సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్బీవై)లో నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఆగస్టు 15లోపు ప్రీమియం చెల్లిస్తే బీమా వర్తిస్తుందని, ఒక ఎకరానికి వరి పంటకు రూ.840, మినుము పంటకు రూ.300 ప్రీమియంగా నిర్ణయించినట్లు వివరించారు.
రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు పీఏసీఎస్లు, రిటైల్ దుకాణాల్లో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏపీఏఐఎంఎస్ యాప్, ఏపీఎఫ్ఆర్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ, పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ జరుగుతుందని వివరించారు.
అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ జీవామృతం, ఘనజీవామృతం వినియోగం వల్ల మొక్కలు సుమారు 15 రోజుల వరకు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం పొందుతాయని రైతులకు సూచించారు.