చాట్రాయిలో విద్యార్థులతో ఘనంగా తిరంగా ర్యాలీ
చాట్రాయిలో విద్యార్థులతో ఘనంగా తిరంగా ర్యాలీ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహశీల్దార్ బి. శ్వేత, ఎంపీడీవో బి.ఏ. సత్యనారాయణ, ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, ఉపాధ్యాయులు అమరయ్య కూడా ర్యాలీలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ బి. శ్వేత మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని అన్నారు. దేశం పట్ల ప్రేమ, బాధ్యత, క్రమశిక్షణ వంటి విలువలను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు.
ఎంపీడీవో బి.ఏ. సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
దేహం మీద భక్తి కంటే దేశం మీద భక్తి గొప్పది: ఎంఈవో-1
ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ దేహం మీద భక్తి కంటే దేశం మీద భక్తి గొప్పదని అన్నారు. మన వ్యక్తిగత జీవితంతో పాటు దేశం పట్ల బాధ్యత, గౌరవం కలిగి ఉండటం ప్రతి పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని, విద్యార్థులు తమ ప్రతిభను దేశ ప్రగతికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ర్యాలీని విజయవంతం చేసిన అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.