చేయి తడపాల్సిందేనా..?
ఏలూరు జిల్లా టి.నరసాపురం రెవెన్యూ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు.. పొజిషన్ సర్టిఫికెట్ల జారీపై అనుమానాలు.. విచారణకు ప్రజల డిమాండ్
టి.నరసాపురం:
టి.నరసాపురం మండల రెవెన్యూ కార్యాలయం మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. భూముల ఆన్లైన్ నమోదు, పట్టాదారు పాస్పుస్తకాల జారీ, పొజిషన్ సర్టిఫికెట్ల మంజూరులో భారీ అవకతవకలు జరుగుతున్నాయంటూ స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. "చేయి తడపకపోతే పనులు జరగవు" అనే పరిస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా నోషనల్ ఖాతాల్లో ఉన్న భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాలకు కూడా నిబంధనలకు విరుద్ధంగా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన చేయకుండా ఒకరి భూమిని మరొకరి పేరుపై చూపిస్తూ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారాల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో భూ వివాదాలు మరింత ముదురుతున్నాయని, కొన్ని కేసులు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లాయని గ్రామస్తులు చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో పారదర్శకత లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక నోషనల్ ఖాతాల నిర్వహణపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తహసీల్దార్ (ఎఫ్ఏసీ) టి.ఎస్. సాయిబాబా స్పందనపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా గ్రామాల్లోని స్మశాన వాటికలు, సమాధుల స్థలాలను కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాధులను పూడ్చివేసి భూములను ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మండల రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.