చికిత్స పొందుతూ శ్వేతా ఘోష్ మృతి....
చికిత్స పొందుతూ శ్వేతా ఘోష్ మృతి.. చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు
తిరుపతి: చెన్నైలోని ఫెర్టిలిటీ సెంటర్లో పనిచేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్వేతా ఘోష్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 13న చెన్నై అమీంజికరై నెల్సన్ మాణిక్యం రోడ్డులోని చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.
ఘటన జరిగిన వెంటనే శ్వేతా ఘోష్ను చెన్నై ఎంజీఎం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈ నెల 20న తిరుపతిలోని అమర ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 21న రాత్రి 9 గంటలకు ఆమె మృతి చెందారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. చెన్నై అమీంజికరై పోలీసులు ఇప్పటికే క్రైమ్ నంబర్ 42/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై పోలీసుల అభ్యర్థన మేరకు రేణిగుంట పోలీసుల సహకారంతో పోస్టుమార్టం నిర్వహణకు అనుమతి కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు చర్యలు తీసుకున్నారు.
శ్వేతా ఘోష్ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్కు చెందిన చెన్నై ఫెర్టిలిటీ సెంటర్లో గత ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. బెంగాలీ సహా పలు భాషలకు అనువాదకురాలిగా విధులు నిర్వహిస్తూ, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చే రోగులతో సమన్వయం చేసేవారు.
చెన్నై ఫెర్టిలిటీ సెంటర్లో నగదు లావాదేవీలు, బిల్లింగ్ అంశంపై వివాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన కల్పన అనే మహిళ ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చిన సమయంలో ఫీజులు, బిల్లింగ్ వివరాలు వివరించే క్రమంలో కమ్యూనికేషన్ లోపం జరిగినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగం, మేనేజర్లు ఆంటోనీ, బాలు, శ్వేతా ఘోష్ను మందలించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె భవనం నాలుగో అంతస్తు నుంచి దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనకు సంబంధించి ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలు, బిల్లింగ్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.