www.ntodaynews.com
ముస్లిం సోదరులకు జనసేన నాయకులు పెంటేల బాలాజీ బక్రీద్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
చిలకలూరిపేట: దైవాజ్ఞను అనుసరించి సమాజ హితాన్ని కోరుతూ ప్రతి మానవుడు నిస్వార్థ సేవాభావంతో ముందుకు సాగాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ అందిస్తుందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ అన్నారు. త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మనకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచడం ద్వారా దాతృత్వాన్ని పెంపొందించుకోవచ్చని, బక్రీద్ పండుగ అందరికీ సేవాభావం, సహనం, కరుణ, సోదరభావం వంటి విలువలను నేర్పుతుందని ఆయన పేర్కొన్నారు. తోటివారి పట్ల ప్రేమ, త్యాగం, సహనంతో మెలగాలనే సందేశాన్ని ఇచ్చే ఈ పవిత్ర పండుగను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అన్ని గుణాలలో దానగుణమే అత్యున్నతమైందని, ఆకలి అన్నది ప్రతి మనిషికీ సమానమని, అందుకే మానవత్వంతో కూడిన ధర్మమే నిజమైన మతసారమని బాలాజీ పేర్కొన్నారు. మతం ఏదైనా మానవత్వమే గొప్పదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని మతాల విశ్వాసాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పాలన కొనసాగిస్తోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో కలిసిమెలసి జీవించాలని, గంగాజమున తహజీబ్ను కాపాడుకుంటూ సమాజంలో ఐక్యతను పెంపొందించాలని కోరారు.
ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అల్లాను ప్రార్థిస్తున్నానని తెలిపారు. బక్రీద్ పండుగ సమాజంలో మరింత సోదరభావాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించాలని పెంటేల బాలాజీ ఆకాంక్షించారు.