చింతలపూడి అంబేద్కర్ గురుకులంలో విద్యార్థుల అవస్థలు.. శిథిల భవనంలోనే చదువు, నిద్ర, భోజనం
అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.. నీటి కోసం పక్క గ్రామంపై ఆధారం
చింతలపూడి, ఏలూరు జిల్లా :
పేద, బడుగు వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్య, వసతి కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. చింతలపూడిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గురుకులం శిథిల భవనంలో కొనసాగుతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే చోట తరగతులు.. హాస్టల్.. భోజనాలు
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతి గదులు, హాస్టల్ వసతి, భోజనశాల వంటి సౌకర్యాలు లేకపోవడం దారుణంగా మారింది. శిథిలావస్థకు చేరిన భవనంలోనే విద్యార్థులు చదువుకోవడం, నిద్రించడం, భోజనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు భవనం పెచ్చులు ఊడి ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు.
నీటి కోసం పక్క గ్రామంపై ఆధారం
గురుకులంలో తాగునీరు, నిత్య అవసరాలకు సరైన నీటి సౌకర్యం కూడా లేకపోవడం సమస్యగా మారింది. సమీపంలోని ఆంతోని నగర్ గ్రామంలోని బోరు నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. బోరు పనిచేయకపోయినా, విద్యుత్ అంతరాయం ఏర్పడినా విద్యార్థులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిర్మించిన హాస్టల్ భవనం నిరుపయోగం
గురుకులం పక్కనే లక్షల రూపాయలతో నిర్మించిన నూతన హాస్టల్ భవనం వినియోగంలోకి రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవనం అందుబాటులో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో అది కూడా పాడుబడే పరిస్థితికి చేరిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
గురుకులంలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, నూతన హాస్టల్ భవనాన్ని మరమ్మతులు చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. శిథిల భవనం నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గురుకులాన్ని పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.