చింతలపూడి నియోజకవర్గంలో మరో మూడు 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు
చింతలపూడి నియోజకవర్గంలో మరో మూడు 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలు : ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
చింతలపూడి: నియోజకవర్గ ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా మరో మూడు 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ మేరకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ అంబేద్కర్తో ప్రత్యేకంగా సమావేశమై విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.
కామవరపుకోట మండలం పాపయ్యపాలెం, చింతలపూడి మండలం పొనుకుమాడు గ్రామాల్లో ఇప్పటికే నూతన విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరు కాగా, వాటి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా చింతలపూడి మండలం చింతపల్లి గ్రామంలో మరో నూతన విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ అంశంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్తో ట్రాన్స్కో ఎస్సీ అంబేద్కర్, డి. రాంబాబు తదితర అధికారులు చర్చించారు.
నూతన విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగడంతో పాటు, రైతులు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.