చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి, ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చింతలపూడిలోని ఆసుపత్రి నిర్మాణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే, ఇప్పటివరకు పూర్తయిన పనులు, చేపట్టాల్సిన పనుల వివరాలను ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని, అదే సమయంలో నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నరసాపురం మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అత్యవసర వైద్యం, ప్రసూతి సేవలు, నిపుణులైన వైద్యుల సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఆసుపత్రిని త్వరగా ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రి పూర్తయిన అనంతరం వైద్యుల కొరత లేకుండా అవసరమైన చర్యలు చేపడతామని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆసుపత్రి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.