చిన్నారులపై దారుణాలకు పాల్పడితే శిక్ష తప్పదు
చిన్నారులపై దారుణాలకు పాల్పడితే శిక్ష తప్పదు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ₹15 వేల జరిమానా
కామారెడ్డి: చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారు చట్టం ముందు నుండి తప్పించుకోలేరని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ హెచ్చరించారు. 2021లో ఎల్లా రెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది.
కేసు వివరాల్లోకి వెళ్తే..
2021 మార్చి 21న సాటేల్లి గ్రామానికి చెందిన దాకలి లక్ష్మణ్ (30), ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎల్లా రెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను సేకరించి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
కోర్టు తీర్పు:
కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి డాక్టర్ CH.V.V.R వరప్రసాద్, నిందితుడు దాకలి లక్ష్మణ్ దోషిగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹15,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
పోలీసులకు అభినందనలు:
సాక్ష్యాధారాలతో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఎల్లా రెడ్డి పోలీసులను, ప్రాసిక్యూషన్ బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ తీర్పు చట్టంపై సామాన్యులకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు. 'పిల్లల రక్షణే మా ప్రాధాన్యత.. ఆపదలో ఉన్నవారు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి' అని భరోసా ఇచ్చారు.
ఈ కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన అప్పటి ఎస్ హెచ్ ఓ ఇస్మాయిల్, ఏఎస్ఐ, డీఎస్పీ కే. శశాంక్ రెడ్డి, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఎస్ హెచ్ ఓ బి. మహేష్, సీఐ డి. రాజా రెడ్డి తదితర అధికారులను ఎస్పీ గారు కొనియాడారు.