చిన్నంపేట గ్రామంలో గడ్డి కాలిపోవడంతో 25 వేల రూపాయల నష్టం
చిన్నంపేట గ్రామంలో గడ్డి కాలిపోవడంతో 25 వేల రూపాయల నష్టం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఘోరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరసా వెంకటేశ్వరాకు చెందిన మూడు ఎకరాల గడ్డివాము పూర్తిగా కాలి బూడిదగా మారింది. ఈ ప్రమాదంలో సుమారు 25 వేల రూపాయల విలువైన గడ్డి కాలిపోయింది. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నోరులేని మూగజీవాలకు మేత కరువైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం మాట్లాడుతూ, "చాట్రాయి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగిందని చింతలపూడి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసినప్పుడు వారు విస్సన్నపేట ఫైర్ స్టేషన్ కు కాల్ చేయమని చెప్పారని విస్సన్నపేట స్టేషన్ వారికి చేయగా తమ పరిధిలో అది లేదని, చింతలపూడి ఫైర్ స్టేషన్ వారే రావాలని చెప్పారని దీంతో చింతలపూడి ఫైర్ స్టేషన్ వారు వచ్చిన తరువాత మంటలను అదుపు చేశారు" అని అన్నారు. కొమ్ము ఆనందం, "ఈ విధమైన ప్రమాదాలకు సమయానికి స్పందించేందుకు చాట్రాయి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది" అని వెల్లడించారు.