చిట్యాల టీటీడీ కళ్యాణ మండపం భూమిపై డిజిటల్ సర్వే పూర్తి
చిట్యాల టీటీడీ కళ్యాణ మండపం భూమిపై డిజిటల్ సర్వే పూర్తి
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం 2002లో కేటాయించిన భూమిపై డిజిటల్ సర్వే ప్రక్రియ పూర్తయింది. ఎమ్మార్వో విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ గురులింగం ఆధ్వర్యంలో సర్వే అధికారులు మంగళవారం భూమిని డిజిటల్ పద్ధతిలో సర్వే చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు గతంలో టీటీడీ కళ్యాణ మండపం కోసం కేటాయించిన 1 ఎకరం 12 గుంటల భూమిపై శనివారం ప్రాథమిక సర్వే నిర్వహించినట్లు ఎమ్మార్వో విజయ్కుమార్ తెలిపారు. అగ్రిమెంట్లో పేర్కొన్న వివరాల ప్రకారం భూమి విస్తీర్ణం 1 ఎకరం 12 గుంటలుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. సర్వేయర్ పూర్తి నివేదిక అందిన అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి భూమి హద్దులను అధికారికంగా నిర్ధారిస్తామని ఎమ్మార్వో పేర్కొన్నారు. అనంతరం పూర్తి సర్వే నివేదికను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంకు అందజేస్తామని తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో ఆర్ఐ జానీ షరీఫ్, సర్వేయర్ రజనీకాంత్, జీపీఓ రెహమాన్, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.