తెలంగాణ రాష్ట్రం లో తప్పుల తడకగా స్మార్ట్ రేషన్ కార్డులు..
తెలంగాణ రాష్ట్రం లో తప్పుల తడకగా స్మార్ట్ రేషన్ కార్డులు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
గ్రామాల పేర్లు, చిరునామాల్లో భారీ తప్పులు.. పంపిణీ నిలిపివేసిన అధికారులు
రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆటంకం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆహార భద్రత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక సాంకేతికతతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రారంభంలోనే తప్పుల మయంగా మారడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పాత రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో గ్రామాల పేర్లు, చిరునామాలు, పోస్టల్ పిన్ కోడ్ వివరాలను సైతం తప్పుగా ముద్రించడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కార్డుల ముద్రణకు ముందు కనీస పరిశీలన కూడా చేయకుండా హడావుడిగా పంపిణీకి సిద్ధం చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పలు మండలాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాల్సి ఉండగా, మొదటి విడతగా శనివారం కొన్ని గ్రామాల్లో అధికారులు కార్డుల పంపిణీ ప్రారంభించారు. అయితే హరిపురం గ్రామంలో కార్డుల పంపిణీ సమయంలో భారీ తప్పులు వెలుగులోకి వచ్చాయి.
హరిపురం గ్రామానికి సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో గ్రామం పేరు ఓదెలగా ముద్రించగా, రాయగూడెం గ్రామపంచాయతీ స్థానంలో బుద్ధారం పేరును, మోటాపురం గ్రామం స్థానంలో రాజేశ్వరపురం పేరును ముద్రించినట్లు గుర్తించారు. అంతేకాకుండా పోస్టల్ పిన్ కోడ్ నంబర్లు కూడా తప్పుగా నమోదు కావడంతో లబ్ధిదారులు అయోమయానికి గురయ్యారు.
ఒక గ్రామానికి సంబంధించిన వివరాలు మరో గ్రామం పేరుతో ముద్రించడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డుల విషయంలో ఇలాంటి తప్పులు చోటుచేసుకోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు మండిపడ్డారు.
తప్పులను గుర్తించిన అధికారులు వెంటనే కార్డుల పంపిణీని నిలిపివేశారు. పంపిణీ చేసిన కార్డులను పరిశీలించి, తప్పులను సరిచేసిన అనంతరం తిరిగి పంపిణీ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
రెవెన్యూ శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ పథకాలు ఇలాంటి తప్పుల కారణంగా ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు తనిఖీలు, పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణలో జరిగిన పొరపాట్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.