చిత్తపూరు, సోమవరం గ్రామాల శివారులలో పేకాట స్థావరాలపై చాట్రాయి పోలీసుల వరుస దాడులు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై చాట్రాయి పోలీసులు వరుసగా దాడులు నిర్వహించారు. చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణకు అందిన సమాచారం మేరకు జూన్ 22న చేపట్టిన దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు మోటార్సైకిళ్లు, రూ.10,300 నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా సోమవారం గ్రామ శివారులో మరో పేకాట స్థావరంపై దాడి నిర్వహించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు మోటార్సైకిళ్లు, రూ.15,150 నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి మొత్తం తొమ్మిది మందిపై చాట్రాయి పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై డి. రామకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై డి. రామకృష్ణ మాట్లాడుతూ జూదం వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తులు, కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తాయని అన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో పేకాట వంటి జూదాలకు అలవాటు పడటం వల్ల కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, సామాజిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని సూచించారు. జూద క్రీడలను నిర్వహించే వారిపైనా, వాటిలో పాల్గొనే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండలంలో ఎక్కడైనా పేకాట, జూదం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్-112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జూదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించబోమని, ఇటువంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్సై స్పష్టం చేశారు.