చండ్రుపట్లలో ఘన జీవామృతం తయారీ....
చండ్రుపట్లలో ఘన జీవామృతం తయారీ.. ప్రకృతి వ్యవసాయంతో పంటలకు కొత్త ఊపు.. అధిక దిగుబడులకు మార్గం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం చండ్రుపట్లలో రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే దిశగా అడుగులు వేయాలని ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది సూచించారు. ఇందులో భాగంగా విస్సన్నపేట మండలం తాతకుంట్ల యూనిట్ పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలో ఘన జీవామృతం తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చండ్రుపట్ల గ్రామానికి చెందిన ఐసీఆర్పీ విస్సంపల్లి విజయలక్ష్మి ఇంటి వద్ద 100 కేజీల ఘన జీవామృతాన్ని తయారు చేశారు. సహజ సిద్ధమైన పదార్థాలతో తయారయ్యే ఘన జీవామృతం భూమి సారాన్ని పెంచడంతో పాటు పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
ఘన జీవామృతం తయారీలో 100 కేజీల ఆవు పేడ, 2 కేజీల పప్పుల పిండి, తగిన మోతాదులో తాటి పండ్ల గుజ్జు, ఆవు మూత్రం, గుప్పెడు పుట్ట మట్టిని ఉపయోగించారు. ఈ పదార్థాలను సరైన పద్ధతిలో కలిపి టైప్-1 ఘన జీవామృతాన్ని తయారు చేశారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రకృతి వనరులతోనే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, జీవామృతం వంటి సహజ ఎరువుల వాడకంతో భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి పంటలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయని అధికారులు తెలిపారు.
రైతులు ప్రకృతి వ్యవసాయంపై మరింత ఆసక్తి చూపాలని, సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సహజ సాగు విధానాలను పాటిస్తే పెట్టుబడి వ్యయం తగ్గి నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది, తాతకుంట్ల యూనిట్ ఇన్చార్జి జి. శ్రీనివాసరావు, ఐసీఆర్పీ విజయలక్ష్మి, లీడ్ ఫార్మర్ మంగతాయారు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని రైతులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా పరిశీలించి ఘన జీవామృతం తయారీ విధానాన్ని తెలుసుకున్నారు.