చనుబండలో వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం
చనుబండలో వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన మోరంపూడి
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరం మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి శాఖా గ్రంథాలయాధికారి శ్రీకాంత్ అధ్యక్షత వహించగా, పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోరంపూడి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు, ఆధునిక దేవాలయాలు అని పెద్దలు చెప్పారని తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు సమ్మర్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించబడుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే పాఠ్యపుస్తకాలతో పాటు వ్యక్తిగత ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకోవడం అవసరమని చెప్పారు. ఈ శిబిరం విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుందని, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని వివరించారు.
మంచి పుస్తకం మన ఆలోచనలను మార్చి, జీవితాన్ని కొత్త దిశలో నడిపించగలదని పేర్కొంటూ, గ్రంథాలయాలను విస్తృతంగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, మిద్దె చెన్నారావు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.