పీర్జాపూర్లో గణేశుడి విగ్రహం ఏర్పాటుపై వివాదం.. చెరువులో నిమజ్జనం
రంగారెడ్డి / Ntoday News: రంగారెడ్డి జిల్లా పీర్జాపూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో గణేష్ విగ్రహం ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. కొందరు గ్రామస్తులు ఆలయంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించి పెద్ద విగ్రహాన్ని తీసుకురావడంతో వివాదం ప్రారంభమైంది.
అయితే మరో వర్గం ఇప్పటికే తాము ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహాన్నే ఆలయంలో ఉంచాలని పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న చౌదరిగూడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదని, విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.
పోలీసుల సూచనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక వర్గం.. తాము తీసుకొచ్చిన గణేష్ విగ్రహాన్ని గ్రామ చెరువులో నిమజ్జనం చేసినట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.