మౌలాలి వద్ద ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్పై తెగిపడిన విద్యుత్ తీగలు.. తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ / Ntoday News: హైదరాబాద్లోని మౌలాలి సమీపంలో విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు సోమవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్కు వస్తున్న రైలు మౌలాలి సమీపానికి చేరుకునే సమయంలో ఓవర్హెడ్ విద్యుత్ తీగలు అకస్మాత్తుగా తెగి రైలు ఇంజిన్, బోగీలపై పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విద్యుత్ తీగలు రైలుపై పడిన సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందికి దిగి పరుగులు తీశారు. అయితే పరిస్థితిని గమనించిన లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమికంగా సాంకేతిక లోపం కారణంగానే ఓవర్హెడ్ విద్యుత్ తీగలు తెగిపడినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అధికారులు విద్యుత్ తీగలను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. అనంతరం రైలు రాకపోకలను పునరుద్ధరించి, ప్రయాణికులను అదే రైలులో సికింద్రాబాద్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఘటనతో కొంతసేపు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.