తిరుమలలో నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
భక్తి
తిరుమల / Ntoday News: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మలయప్పస్వామి సమక్షంలో సకల దేవతలు, అష్టదిక్పాలకులను ఆహ్వానించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలిరానున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొత్తం 16 వాహన సేవలతో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. బ్రహ్మోత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.