డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్..
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్.. తిరువూరులో వైఎస్సార్సీపీ 'ఏపీ జెన్-జెడ్' రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
తిరువూరు, ఆగస్టు 6: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ కేంద్రంలోని బోసుబొమ్మ సెంటర్లో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో "ఏపీ జెన్-జెడ్ రిలే నిరాహార దీక్షలు" ప్రారంభమయ్యాయి. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన, విద్యార్థి విభాగం నాయకులు, పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలో బైఠాయించారు.
ఈ కార్యక్రమాన్ని తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ దీక్షా శిబిరంలో పాల్గొన్న నాయకులకు పూలదండలు వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించిన స్వామిదాస్, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు అధిక సంఖ్యలో ఈ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది.