డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు విజయవంతంగా సర్జరీ
ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు
పవన్ క్షేమంగా ఉన్నారంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రకటన
వారం నుంచి 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
అధికారిక సమావేశంలో అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. "పవన్ కల్యాణ్ గారు శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన త్వరగా శక్తిని పుంజుకుని, మునుపటి కంటే ఆరోగ్యంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన త్వరగా విధుల్లోకి తిరిగి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. "మన ప్రియతమ నాయకుడు పవన్ కల్యాణ్కు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఆయన క్షేమంగా, ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, త్వరలోనే నూతన శక్తితో తిరిగి వస్తారు. ఆయన దృఢత్వమే మనకు స్ఫూర్తి, ఆయన ఆరోగ్యమే మన ఆనందం" అని నాగబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం నాడు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా అధికారులతో చర్చిస్తుండగా పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎమ్ఆర్ఐ స్కాన్తో పాటు పలు పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, 7 నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి. హరి ప్రసాద్ తెలిపారు. అయితే, పవన్కు ఎదురైన అనారోగ్య సమస్య ఏంటి, ఏ రకమైన శస్త్రచికిత్స చేశారనే వివరాలను పార్టీ వర్గాలు వెల్లడించలేదు.