ధాన్యం, మొక్కజొన్నల దిగుమతిని వేగవంతం చేయాలి
ధాన్యం, మొక్కజొన్నల దిగుమతిని వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్ గోదాముల తనిఖీ; హమాలీల కూలి సకాలంలో చెల్లించాలని సూచన
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా వివిధ కొనుగోలు కేంద్రాల నుండి తరలించిన ధాన్యాన్ని, మొక్కజొన్నలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా దిగుమతి చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను, గోదాం నిర్వాహకులను కోరారు. గురువారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోదామును మండల తహసిల్దార్ సంతోష్ కుమార్తో కలిసి ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న ధాన్యం, మొక్కజొన్నల దిగుమతి ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, కేటాయించిన మిల్లులు, గోదాములకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. గోదాములకు వచ్చిన ధాన్యంతో పాటు మొక్కజొన్నలను కూడా త్వరితగతిన దిగుమతి చేసి భద్రపరచాలని, ఎక్కడా ఎలాంటి జాప్యం జరగకూడదని సూచించారు. అదేవిధంగా, హమాలీల కూలి వేతనం చెల్లింపుల అంశంపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ (డిఎం)తో ఫోన్ ద్వారా మాట్లాడి, హమాలీలకు సకాలంలో కూలి డబ్బులు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, గోదాం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు