ఈనెల 21న మంచిర్యాలకు కేటీఆర్ రాక
- మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం
- ఓటర్ల సవరణ ప్రక్రియపై అధికారుల లెక్కలు తప్పు
ఈనెల 21న మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ వెల్లడించారు. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా లక్షెట్టిపేట మండలంలోని వాసవి ఫంక్షన్ హాల్లో ‘రైతు సదస్సు’ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ చేతుల మీదుగా రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమావేశంలో విజిత్ కుమార్ మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియపై అధికారులు, ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. ఎన్యూమరేషన్ పత్రాలను 100 శాతం పంపిణీ చేశామనడం ముమ్మాటికీ అబద్ధమని, తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వాస్తవంగా ఎంతవరకు పూర్తయిందో అసలు నిజాలను అధికారులు వెంటనే బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు