ఎరువుల వ్యాపారులకు పోలీసుల హెచ్చరికలు
ఎరువుల వ్యాపారులకు పోలీసుల హెచ్చరికలు
ఏలూరు, మార్చి 24: రైతుల సంక్షేమం, ప్రజల భద్రత దృష్ట్యా లింగపాలెం మండలంలో ఎరువుల వ్యాపారులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చింతలపూడి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్నల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు వ్యాపారులకు పలు కీలక సూచనలు చేశారు. రైతుల నుంచి అనధికారిక నగదు డిపాజిట్లు సేకరించరాదని స్పష్టం చేశారు. నాణ్యతలేని, నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నిషేధించిన పురుగుమందులు, రసాయనాలను నిల్వ ఉంచడం లేదా అమ్మడం పూర్తిగా నిషేధమన్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు, పురుగుమందులు విక్రయించరాదని ఆదేశించారు.
మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించే వ్యక్తులకు పురుగుమందులు అమ్మకూడదని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అదే విధంగా రహదారి భద్రతపై కూడా అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
ప్రభుత్వం, పోలీస్ శాఖ జారీ చేసిన నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.