విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జీ అమానుషం – సిపిఐ(ఎంఎల్) లిబరేషన్
విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జీ అమానుషం – సిపిఐ(ఎంఎల్) లిబరేషన్
విసన్నపేట, జూలై 20: ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్లో పాల్గొన్న లక్షలాది మంది విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా తమ రాజకీయ అజెండాను అమలు చేయడానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరినాథ్ ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనను అణచివేయాలనే ఉద్దేశంతో అమానుషంగా లాఠీచార్జీకి పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో నెలకొన్న ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పదని పేర్కొన్నారు.
నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆందోళనల సందర్భంగా మరణించిన 23 మంది కుటుంబాలకు తక్షణమే తగిన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు.
నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నూతన విద్యా విధానంలోని లోపాలను దేశ ప్రజల ముందుంచడంలో విద్యార్థి ఉద్యమం విజయవంతమైందని హరినాథ్ అన్నారు. విద్యార్థి నాయకులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం కూడా ఉద్యమ విజయమేనని పేర్కొన్నారు.
ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని బహిరంగంగా ఖండించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఐసా, ఆర్వైఏ, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు పార్లమెంట్ మార్చ్కు సంఘీభావం తెలుపుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాయని, ఉద్యమానికి మద్దతు తెలిపిన అన్ని ప్రజాసంఘాలకు హరినాథ్ అభినందనలు తెలిపారు.