ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దళితుల అభివృద్ధికే ఖర్చు చేయాలి
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దళితుల అభివృద్ధికే ఖర్చు చేయాలి : డీహెచ్పీఎస్ డిమాండ్
ఏలూరు కలెక్టరేట్ వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఆందోళన
ఏలూరు: ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, సబ్ప్లాన్ నిధులను పూర్తిగా దళిత, గిరిజన వర్గాల అభివృద్ధికే వినియోగించాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా డీహెచ్పీఎస్ ఏలూరు జిల్లా ఇన్చార్జి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పథకాన్ని ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. దళిత, గిరిజన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడం, ఆర్థిక అసమానతలు తొలగించడం, సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
దళితుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్లో 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం తీసుకొచ్చినా నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సబ్ప్లాన్ చట్టాన్ని బలహీనపరుస్తోందని మండిపడ్డారు.
జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించి, ఆ నిధులను దళిత, గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఇతర దళిత సంఘాలు, ప్రజాస్వామిక వాదులను కలుపుకొని రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
సీపీఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్, దళిత నాయకులు మత్తె బాబీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు కేటాయించిన నిధులను ఆయా వర్గాల సంక్షేమ పథకాలకు ఖర్చు చేయకుండా ఇతర సాధారణ పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోతున్నాయని, ప్రభుత్వ శాఖల్లో సబ్ప్లాన్ నిధులు పూర్తిస్థాయిలో వినియోగం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి, మావూరి విజయ, గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, లక్కోజు జగదీశ్వరి, ఎం.ఏ. హకీమ్, ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవాని, ఉప్పులూరి జ్యోతి, ఉప్పులూరి ప్రభావతి, మాల మహాసేన నాయకులు ఎరికిపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.