లయన్స్ క్లబ్ దూబచర్ల సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఉచిత దంత పరీక్షలు, రక్తదాన శిబిరం
దూబచర్ల: లయన్స్ క్లబ్ దూబచర్ల 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని పార్డ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ స్క్రీనింగ్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దూబచర్లలోని ఎలైట్ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భీమవరం విష్ణు డెంటల్ కాలేజీ, ఏలూరు బ్లడ్ సెంటర్ సహకారం అందించాయి.
కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛఆంధ్ర డైరెక్టర్ కూచిపూడి ఉదయభాస్కరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం భీమవరం విష్ణు డెంటల్ కాలేజీకి చెందిన డాక్టర్ కె. చైతన్య రామ్ ఆధ్వర్యంలోని దంత వైద్యుల బృందం శిబిరానికి వచ్చిన వారికి దంత పరీక్షలు నిర్వహించింది. దంతాల ఆరోగ్యం, నోటి పరిశుభ్రత, దంత సమస్యల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అదేవిధంగా ఏలూరు బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. శశికళ, కౌన్సిలర్ జి. జయలక్ష్మి వైద్య సేవలను పర్యవేక్షించారు. ఎలైట్ కాలేజీకి చెందిన 50 మందికి పైగా విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. యువత రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పార్డ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ దూబచర్ల అధ్యక్షుడు తమ్మిన శ్రీనివాసరావు, సెక్రటరీ నెక్కంటి వెంకటేష్, పార్డ్ ఇండియా నల్లజర్ల శాఖ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ షరీఫ్, చీమకుర్తి కృష్ణ ప్రసాద్, ఎలైట్ విద్యాసంస్థల ప్రిన్సిపల్ కరగల శ్రీలక్ష్మి, డైరెక్టర్లు యలమర్తి సుదర్శన్ రావు, గారపాటి సుబ్బారావు, సోమిశెట్టి వెంకటరావు, జామి రాంబాబు, మద్దాల రాంబాబు, చిట్యాల సత్యనారాయణమూర్తి, ముత్త నాగార్జున, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ దూబచర్ల 25 ఏళ్ల సేవా ప్రయాణంలో భాగంగా ప్రజల ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమానికి ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్వహించిన ఈ ఉచిత వైద్య, రక్తదాన శిబిరం ద్వారా ప్రజలకు సేవ చేయడం సంతృప్తినిచ్చిందన్నారు.
కార్యక్రమానికి సహకరించిన విష్ణు డెంటల్ కాలేజీ వైద్య బృందం, ఏలూరు బ్లడ్ సెంటర్ సిబ్బంది, ఎలైట్ విద్యాసంస్థల యాజమాన్యం, రక్తదాతలు, స్వచ్ఛంద సేవకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.