గంగాదేవిపల్లి రహదారి ప్రమాదాలకు నిలయం..! హెచ్చరిక బోర్డులు ఎక్కడ..?
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని గంగాదేవిపల్లికి వెళ్లే తాడిపత్రి–గుత్తి ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఇటీవల ఈ మార్గంలో వరుసగా నాలుగు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ప్రమాదాలు తరచూ జరుగుతున్నప్పటికీ సంబంధిత నేషనల్ హైవే అధికారులు ఇప్పటివరకు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని వాహనదారులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రమాదకర మలుపులు ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచనలు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేకించి రాత్రి వేళల్లో రహదారిపై సరైన సూచికలు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే భద్రతా చర్యలు చేపట్టి, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.