గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. సమాచారం ఇస్తే నగదు ప్రోత్సాహకం
గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. సమాచారం ఇస్తే నగదు ప్రోత్సాహకం
డ్రగ్స్ రహిత తిరువూరు లక్ష్యంగా ఈగల్ ఛాలెంజ్.. విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక నిఘా
తిరువూరు: గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తిరువూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్పై దండయాత్ర–2.0 కార్యక్రమంలో భాగంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ రహిత తిరువూరుగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, పోలీస్ కమిషనర్ శేఖర్బాబు ఆదేశాల మేరకు ఈగల్ బృందం ఆధ్వర్యంలో గంజాయి నియంత్రణ చర్యలు ముమ్మరం చేసినట్లు తిరువూరు సీఐ గిరిబాబు వెల్లడించారు. మైలవరం ఏసీపీ రామచంద్రరావు పర్యవేక్షణలో పోలీస్ అధికారులు నిరంతరం గంజాయి అక్రమ కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
తిరువూరు పోలీస్స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా గంజాయి మహమ్మారిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. గంజాయి సేవించే వారి సమాచారం అందించిన వారికి రూ.1,500, గంజాయి విక్రయించే వారి సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు.
డ్రగ్స్ రహిత తిరువూరు లక్ష్యంతో ప్రభుత్వ సూచనల మేరకు ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్సై శాతకర్ణి తెలిపారు. గతంలో డ్రగ్స్పై దండయాత్ర–1.0, అవగాహన అనంతరం కార్యాచరణ, మార్పుకు మరో అవకాశం వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని చెప్పారు.
తిరువూరు పోలీస్స్టేషన్లో నిర్వహించిన ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఎస్సైలు ఆర్. రాజు, గౌరేశ్వరి పాల్గొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న పలువురిని గుర్తించి ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు సీఐ గిరిబాబు పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉన్న ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలీసులకు తెలియజేయాలని ఎస్సై శాతకర్ణి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, సమాచారాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
యువత భవిష్యత్తును కాపాడేందుకు గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.