గంపలగూడెంలో చెరువులు అడుగంటాయి.. వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు
(ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం)
వర్షాభావ పరిస్థితులు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి సాగునీరు అందకపోవడంతో గంపలగూడెం మండలంలోని చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఆధారంగా చేసుకుని రైతులు వరి నాట్లు వేయడంతో ప్రస్తుతం చెరువుల్లో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది.
మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల కింద ఇప్పటికీ వరి నాట్లు ప్రారంభం కాలేదు. మరికొన్ని గ్రామాల్లో వర్షాలు కురుస్తాయనే ఆశతో చెరువుల్లో నిల్వ ఉన్న నీటితో రైతులు వరి నాట్లు వేశారు. దీంతో చెరువుల్లోని నీరు వేగంగా అడుగంటుతోంది. మరో వారం, పది రోజుల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే మిగిలిన కొద్దిపాటి నీరు కూడా లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో రెండు చెరువులు ఉండగా, శివాలయం సమీపంలోని ఒక చెరువు కింద మాత్రమే రైతులు వరి నాట్లు వేశారు. నాట్ల కోసం చెరువు నీటిని వినియోగించడంతో ఆ చెరువు కూడా ఎండిపోయే పరిస్థితికి చేరుకుందని రైతులు తెలిపారు.
వర్షాలు ఆలస్యమైతే ఇప్పటికే వేసిన వరి పంటలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాగునీటి సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.